హైదరాబాద్, సెప్టెంబర్ 26: బ్యాంకులు అనేక రకాల సేవలను ఖాతాదారులకు ఉచితంగానే అందిస్తాయి. అయితే కొన్నింటికి మాత్రం చార్జీలు వర్తిస్తాయి. ఒక్కోదానిపై ఒక్కోలా ఈ ఫీజులుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు ప్రధాన బ్యాంకర్లు వసూలు చేస్తున్న చార్జీలను పరిశీలిస్తే..
డెబిట్ కార్డులపై..
చాలావరకు డెబిట్ కార్డులు ఖాతాదారులకు ఉచితమే. కానీ కొన్ని సందర్భాల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఎస్బీఐలో కొన్ని డెబిట్ కార్డులపై రూ.300 వరకు జాయినింగ్ ఫీజు ఉన్నది. వార్షిక ఫీజు రూ.125-350 మధ్య ఉండగా, రీప్లేస్మెంట్ ఫీజు రూ.300. అలాగే పీఎన్బీలో జాయినింగ్ ఫీజు రూ.250గా ఉంటే, వార్షిక ఫీజు రూ.500 వరకు, రీప్లేస్మెంట్ ఫీజు రూ.150. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో జాయినింగ్, వార్షిక ఫీజులు రూ.200-750 మధ్య, రీప్లేస్మెంట్ ఫీజు దాదాపు రూ.200లుగా ఉన్నది. ఐసీఐసీఐ బ్యాంక్లో జాయినింగ్ ఫీజు గరిష్ఠంగా రూ.1,999. వార్షిక ఫీజు రూ.99-1,499. ఈ కార్డులపై ప్రయోజనాలూ ఎక్కువే. ఇక అన్ని బ్యాంకులు పిన్ డూప్లికేషన్/రీజనరేషన్కు రూ.50 వసూలు చేస్తున్నాయి.
ఏటీఎం చార్జీలు
నెలకు ఆరుసార్లకు మించి ఖాతాదారులు ఎస్బీఐ ఏటీఎంను వినియోగిస్తే రూ.10 చొప్పున చార్జీలు పడుతాయి. పరిమితికి మించి ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే రూ.20 చొప్పున కట్టాలి. పీఎన్బీ ఏటీఎంలో ఉచిత లావాదేవీలు నెలకు ఐదే. ఆపై రూ.10 చొప్పున చార్జీ ఉంటుం ది. ఖాతాదారులు ఇతర బ్యాంక్ ఏటీఎంలను పరిమితికి మించి ఉపయోగిస్తే రూ.20 చొప్పున ఇవ్వాలి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ఖాతాదారులు నెలలో సొంత ఏటీఎంలను ఐదుసార్లు, ఇతర ఏటీఎంలను మూడుసార్లు ఫ్రీగా వాడుకోవచ్చు. ఆపై లావాదేవీలకు రూ.21 చొప్పున ఇవ్వాలి.
నెఫ్ట్, స్టేట్మెంట్ల కోసం..
నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ బదిలీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2.25-45 మధ్య చార్జీలను వసూలు చేస్తున్నది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.2-15, ఎస్బీఐ రూ.2-40, పీఎన్బీ రూ.2-49.5 మేర తీసుకుంటున్నాయి. ఇక డూప్లికేట్ స్టేట్మెంట్ల కోసం ఖాతాదారుల నుంచి బ్యాంకులన్నీ రూ.118 చొప్పున వసూలు చేస్తున్నాయి.
అంతర్జాతీయ లావాదేవీలకు
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు డెబిట్ కార్డు ద్వారా ఇతర కరెన్సీల్లో లావాదేవీలు లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం సదరు మొత్తంలో 3.5 శాతం చార్జ్ చేస్తున్నాయి. పీవోఎస్, ఈ-కామర్స్ లావాదేవీల కోసం ఎస్బీఐ, పీఎన్బీలు 3 శాతం చొప్పున తీసుకుంటున్నాయి. విదేశాలకు నగదు బదిలీలకు సంబంధించి ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు రూ.500-1,000 మేర తీసుకుంటుండగా, పీఎన్బీ మాత్రం లావాదేవీలో 0.125 శాతం లేదా కనీసం రూ.500 వసూలు చేస్తున్నది. స్విఫ్ట్ బదిలీలకు రూ.100 అదనం. ఎస్బీఐ చార్జీలు కనిష్ఠంగా రూ.35, గరిష్ఠంగా రూ.7,000లుగా ఉన్నది.
కనీస నగదు నిల్వలపై..
రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లలో ఎస్బీఐ ఫైన్లు వేయడం లేదు. పొదుపు ఖాతాల్లో సూచించిన మొత్తాలు లేకపోతే మూడు నెలలకోసారి పీఎన్బీ రూ.600 వరకు వసూలు చేస్తున్నది. నగదు నిల్వల ఆధారంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.150-600 మధ్య ఫైన్ వేస్తున్నది. ఐసీఐసీఐ 6 శాతం లేదా రూ.500 తీసుకుంటున్నది.