న్యూఢిల్లీ, మే 7: భారత్లో సావరిన్ వెల్త్ ఫండ్స్ (విదేశీ ప్రభుత్వ ఫండ్లు)కు చెందిన మొత్తం సెక్యూరిటీలు (ఆస్తులు) ఈ ఏప్రిల్తో ముగిసిన ఏడాది కాలంలో దాదాపు 60 శాతం పెరిగాయి. దీంతో రూ.4.7 లక్షల కోట్లకు చేరినట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) తెలిపింది. నిరుడు ఏప్రిల్ నాటికి ఇవి రూ.3 లక్షల కోట్ల వద్దే ఉన్నాయన్నది. మరోవైపు మొత్తం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్పీఐ) ఆధ్వర్యంలోని ఆస్తులు సుమారు 40 శాతం పెరిగి ఈ ఏడాది రూ.69.5 లక్షల కోట్లను తాకడం విశేషం.
గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్లకు అనువైన విధానాలను అవలంభిస్తుండటం, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వంటి పలు విదేశీ ప్రభుత్వ ఫండ్లకు ప్రత్యేక పన్ను మినహాయింపుల్ని కల్పించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారతీయ మార్కెట్లో సింగపూర్ ప్రభుత్వం, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నార్వెయిన్ పెన్షన్ ఫండ్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్లో సింగపూర్ ప్రభుత్వానికి 1.5 శాతం వాటా ఉన్నది. దీని విలువ ప్రస్తుతం దాదాపు రూ.30,000 కోట్లు. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 2.34 శాతం వాటా ఉన్నది.
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది సుమారు రూ.25,000 కోట్లు. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి కూడా ఐపీసీఏ లాబొరేటరీస్, వెల్స్పన్ వంటి భారతీయ సంస్థల్లో వాటాలున్నాయి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) మార్గం ద్వారా దేశీయ మౌలిక రంగంలో అబుదాబీ ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడుల్ని గుమ్మరిస్తున్నది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐషర్ మోటర్స్ వంటి డజనుకుపైగా స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో నార్వే పెన్షన్ ఫండ్కు వాటాలున్నాయి. మరోవైపు విదేశీ సెంట్రల్ బ్యాంకులను సైతం కేంద్ర ప్రభుత్వం ఆకట్టుకోవాలని చూస్తుండగా, విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కారు తలుపులు బార్లా తెరుస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ ప్రభుత్వ ఫండ్లకు.. భారతీయ మార్కెట్లో, దేశీయ కంపెనీల్లో పెట్టుబడులు పెరుగుతూపోతే తిప్పలు తప్పవని మరికొందరు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.