హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ‘లైంగికవేధింపుల కేసులను ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లనేమో దేశం దాటిస్తారు. నాలాంటి వాళ్లనేమో అరెస్టు చేశారు’ ఇదేం పద్ధతి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను దర్యాప్తు అధికారులు మంగళవారం రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
దర్యాప్తు అధికారుల విజ్ఙప్తిమేరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 14 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొన్నది. కవిత తనకు పది పుస్తకాలు కావాలని కోరగా న్యాయమూర్తి అనుమతించారు. తనకు ఇంటి నుంచి తీసుకొస్తున్న భోజనాన్ని 10-15 మంది పోలీసులు తనిఖీ చేసిన తర్వాత పంపుతున్నారని, అన్ని తనిఖీల తర్వాత ఆ భోజనం మొత్తం పాడైపోతున్నదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి భోజనానికి సంబంధించిన తుది నిర్ణయంపై జైలు సూపరింటెండెంట్ను వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు వెలుపల అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి కవిత కొద్దిసేపు మాట్లాడారు. తన అరెస్టు అక్రమం అని అన్నారు.