ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్లో ఫ్రేజర్, పొరెల్, స్టబ్స్ దంచికొట్టి ఆ జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వీరోచిత పోరాటం చేసినా ఆఖర్లో తడబడ్డ ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది ఆరో విజయం కాగా 12 పాయింట్లతో పంత్ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది.
ఢిల్లీ: ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో సొంత వేదికపై జూలు విదిల్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి రాయల్స్ను 20 పరుగుల తేడాతో చిత్తుచేసి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 222 పరుగులు ఛేదనలో రాజస్థాన్ పోరాడినా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును ఓటమివైపున నిలిపింది. సంజూ శాంసన్ (46 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్తో పోరాడినా ఆ జట్టు 20 ఓవర్లలో 201/8 పరుగులకే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. అభిషెక్ పొరెల్ (36 బంతుల్లో 65, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జేక్ ఫ్రేసర్ (20 బంతుల్లో 50, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తొలి ఓవర్ నుంచే బాదుడుకు గేట్లు ఎత్తేసిన ఢిల్లీ యువ సంచలనం ఫ్రేజర్ రాజస్థాన్ బౌలర్లపై పిడుగులా ఉరిమిపడ్డాడు. బౌల్ట్ 3వ ఓవర్లోనే ఓ సిక్స్, రెండు ఫోర్లతో ట్రాక్లోకి వచ్చిన అతడు.. అవేశ్ఖాన్ 4వ ఓవర్లో 4, 4, 4, 6, 4, 6తో 28 పరుగులు రాబట్టి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అశ్విన్ అతడి ఆట కట్టించినా బాదుడు బాధ్యతను పొరెల్ ఎత్తుకున్నాడు. సందీప్ శర్మ, చాహల్, పరాగ్, అవేశ్ ఓవర్లలో భారీ షాట్లతో రెచ్చిపోయాడు. 28 బంతుల్లోనే పొరెల్ అర్ధ శతకం పూర్తైంది. అక్షర్ పటేల్ (15), పంత్ (15), గుల్బాదిన్ (19) విఫలమైనా ఆఖర్లో స్టబ్స్ దంచడంతో ఢిల్లీ భారీ స్కోరుచేసింది.
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు జైస్వాల్ (4), బట్లర్ (19) విఫలమయ్యారు. కానీ కెప్టెన్ శాంసన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. పరాగ్ (22 బంతుల్లో 27)తో కలిసి మూడో వికెట్కు 36 పరుగులు జోడించిన అతడు.. శుభమ్ దూబే (25) తో నాలుగో వికెట్కు 59 రన్స్ జతచేశాడు. 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసిన శాంసన్.. సలం వేసిన 13వ ఓవర్లో 6, 4, 6తో స్కోరువేగాన్ని పెంచాడు. దూబే కూడా గేర్ మార్చడంతో రాజస్థాన్ లక్ష్యం దిశగా సాగింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 63 పరుగులు అవసరమనగా.. ముకేశ్ 16వ ఓవర్లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో శాంసన్ పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ తడబడింది. మ్యాచ్లో ఇదే టర్నింగ్ పాయింట్. కుల్దీప్ ఒకే ఓవర్లో ఫెరెరా, అశ్విన్ను ఔట్ చేయడంతో రాయల్స్ ఓటమి ఖరారైంది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 221/8 (పొరెల్ 65, ఫ్రేజర్ 50, అశ్విన్ 3/24, సందీప్ 1/42).
రాజస్థాన్: 20 ఓవర్లలో 201/8 (శాంసన్ 86, పరాగ్ 27, కుల్దీప్ 2/25, ముకేశ్ 2/30)