ముంబై, మే 7: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవడంతో ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు ఈ నష్టాలను భారీగా తగ్గించుకోగలిగింది. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల పతనం మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 383.69 పాయింట్లు కోల్పోయి 73,511.85 వద్ద స్థిరపడింది.
అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 140.20 పాయింట్లు కోల్పోయి 22,302.50 వద్దకు జారుకున్నది. మార్కెట్లో పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్లు నష్టపోగా..హెచ్యూఎల్, టెక్ మహీంద్రా, నెస్లె, ఐటీసీ, విప్రో, టీసీఎస్, కొటక్ మహీంద్రా బ్యాంక్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ, యుటిలిటీ, కమోడిటీస్, కన్జ్యూమర్ డ్యూరబుల్, టెలికం రంగ షేర్లు నాలుగు శాతం వరకు నష్టపోగా..ఐటీ, టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి.
ఈ నెల 18న బీఎస్ఈతోపాటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ)లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహించబోతున్నారు. ప్రాథమిక సైట్లో ఏదైన అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రత్యేక సెషన్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ప్రైమరీ సైట్ ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు, డీఆర్ సైట్ 11.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు ట్రేడింగ్ను నిర్వహించనున్నారు.
ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తిరస్కరించింది. స్టాక్ బ్రోకర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఈక్విటీల సమయాన్ని పొడిగించే ప్రతిపాదనేది లేదు..సెబీకి అవసరమైన సమాచారాన్ని స్టాక్ బ్రోకర్లు ఇవ్వలేరని, దీంతో సమయం పొడిగించే ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశిశ్ కుమార్ చౌహాన్ తెలిపారు. స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నాం 3.30 గంటల వరకు కొనసాగనున్నాయి. బ్రేక్ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రేడింగ్, కమోడిటీ డెరివేటివ్ సమయాన్ని రాత్రి 11.55 గంటల వరకు పెంచాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది.