హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వానకాలంలో మంచి వానలు పడి పంట వేస్తే.. సరి! వానలు పడలేదని, నీళ్లు లేవని పంట వేయకుండా ఉంటారో.. ఆ సీజన్కు రైతుబంధు చిల్లిగవ్వ కూడా ఇచ్చేదే లేదు. యాసంగిలోనూ అంతే.. పంట వేస్తేనే రైతు చేతికి రైతుబంధు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా విధించబోతున్న ఆంక్ష. మొన్నటిదాకా చెట్లు, గుట్టలకు రైతుబంధు ఇవ్వబోమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా సాగు భూములకూ పెట్టుబడి సాయం ఎగబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు వానకాలంలో పంట సాగు చేసి, యాసంగిలో సాగు చేయకపోయినా రైతులకు ఉన్న మొత్తం భూమికి పెట్టుబడి సాయం అందేది.
కానీ ఈ వానకాలం సీజన్ నుంచి మొత్తం భూమికి రైతుబంధు రావటం కష్టమే. ఎందుకంటే.. రైతులకు పెట్టుబడి సాయంపై ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇకపై పంట సాగే ప్రామాణికంగా రైతులకు సాయం అందించనున్నది. అంటే.. సీజన్ ఏదైనా రైతు పంట సాగు చేసిన భూమికే రైతుబంధు ఇవ్వనున్నది. ఇందుకోసం రిమోట్ సెన్సింగ్తో పాటు ఇతర టెక్నాలజీలతో పంట సాగు చేసిన భూమిని లెక్కించనున్నది. ఈ సర్వేలో రైతు పంట సాగు చేసినట్టు చూపితేనే ఆ రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. లేదంటే అంతే సంగతి.
రైతులు అన్ని సీజన్లలో తమకున్న మొత్తం భూమిలో పంటలు సాగు చేయరు. వానకాలంలో ఎక్కువ భూమిలో సాగు చేస్తే, యాసంగిలో సగం భూమిలోనే సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పంపిణీలో చేయబోయే మార్పులతో ఇకపై యాసంగిలో రైతుబంధు రావటం గగనం కానున్నది. ప్రతి రైతుకు ఇప్పుడొస్తున్న రైతుబంధులో సగం మేర కోత పడనున్నది. ఉదాహరణకు.. వానకాలంలో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగై, యాసంగిలో 66 లక్షల ఎకరాలకే పరిమితమైతే.. అంతే మొత్తానికి రైతుబంధు అందుతుంది. అంటే రైతులకు వానకాలంలో 1.26 కోట్ల ఎకరాలకు జమైతే, యాసంగికి వచ్చేసరికి 66 లక్షల ఎకరాలకే పెట్టుబడి సాయం వస్తుంది. ఈ లెక్కన యాసంగిలో 60 లక్షల ఎకరాలకు రైతుబంధు కోత పడనున్నది. అంటే సగం భూమికి రైతుబంధు రాదన్నట్టే.
రైతుబంధులో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ మార్పులతో ఏటా కోటి ఎకరాలకు పెట్టుబడి సాయం కోత పడనున్నది. గత ఏడాది వానకాలంలో కేసీఆర్ సర్కారు 1.52 కోట్ల ఎకరాలకు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ లెక్కన యాసంగిలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే మొత్తానికి రైతుబంధు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో మొత్తం ఏడాదికి రెండు సీజన్లు కలిపి 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు అందాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంట సాగు చేసిన భూములకే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించటంతో కోత పడనున్నది. గత ఏడాది వానకాలంలో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, యాసంగిలో 66 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. రెండు సీజన్లలో కలిపి 1.92 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే 3.04 కోట్ల ఎకరాలకు రావాల్సిన రైతుబంధు.. 1.92 కోట్ల ఎకరాలకే వస్తుంది. అంటే 1.12 కోట్ల ఎకరాలకు సాయం అందదు. సాగు విస్తీర్ణం తగ్గితే, పెట్టుబడి సాయం కూడా మరింత తగ్గుతుంది. తద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
పంట సాగుకు, పెట్టుబడి సాయానికి లింకుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి పంట సాగు లెక్కల్ని పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఏ సర్వే నంబర్లో ఎంత పంట సాగైందనే లెక్కల్ని తీసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగించనున్నది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి సర్వే నంబర్లో ఎంత భూమి సాగైందో లెక్కించనున్నది. ఆ తర్వాత ఏఈవోలతోనూ పంట విస్తీర్ణాన్ని లెక్కిస్తుంది. ఈరెండింటిని పెట్టుబడి సాయానికి లింక్ చేసి, ఎంత భూమి సాగు చేశారో లెక్కించనున్నది.
సాగుకు ముందు పెట్టుబడి సాయం అందించి, రైతులను అప్పుల బారి నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో రైతుబంధును కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో రైతుబంధు ముఖ్య ఉద్దేశమే దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే.. రైతు పంట వేసి, సర్వే పూర్తయ్యాకే సాయం అందించనున్నది. ఇదే జరిగితే రైతులకు మళ్లీ పెట్టుబడి కష్టాలు మొదలవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నేండ్లు సీజన్కు ముందే పెట్టుబడి సాయం అందటంతో రైతులు రంది లేకుండా ఉండేవారు. కానీ, మళ్లీ పెట్టుబడి సాయం కోసం ప్రైవేటు వ్యాపారులు, గ్రామాల్లోని షావుకార్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
రైతుబంధు సాయాన్ని రైతుభరోసా పేరుతో అమలు చేసి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తప్పించుకొనేందుకు కోతలు పెడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.10 వేల చొప్పున పంపిణీకి రూ.15-16 వేల కోట్లు అవసరం అయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలంటే ఏటా 1.52 కోట్ల ఎకరాలకు రూ.22,800 కోట్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకే రైతుబంధులో కోతకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంట సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. అంటే.. సాగు సమయానికి రైతుకు పెట్టుబడి సాయం అందదు. రైతు పంట సాగు చేసి, సర్వే పూర్తయ్యాకే సాయం అందుతుంది. అంటే ఇది పెట్టుబడి సాయం కాబోదు. ఇదే జరిగితే రైతులకు దీని వల్ల ఏం లాభం? అనేదే ప్రశ్న. సాగుకు ముందు పెట్టుబడి సాయం ఇచ్చి రైతులను ఆదుకోవాలి కానీ, రైతులే పెట్టుబడి పెట్టుకొని పంటలు సాగు చేశాక ఇవ్వటం ఏమిటి? అన్నది మరో ప్రశ్న.
పంటల సాగుకు రైతులు అప్పులు చేయొద్దన్న సంకల్పంతో కేసీఆర్ సర్కారు రైతుబంధును ప్రవేశపెట్టింది. సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఉపయోగపడుతుందన్నది ముఖ్య ఉద్దేశం. ఏటా వానకాలం, యాసంగి.. రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.10 వేల సాయం అందించింది.