Adilabad | ఆదిలాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఓ వృద్ధురాలు మండిపడింది. నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా మాట నిలబెట్టుకోలేదని మండిపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోరలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అన్నం ఆశక్క అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి బీఆర్ఎస్కు ఓటేయాలని కోరగా.. తప్పకుండా కారు గుర్తుకే వేస్తానని చెప్పింది. రేవంత్ సర్కార్ను తూర్పారబట్టింది. పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడింది. కేసీఆర్ ప్ర భుత్వం మంజూరు చేసిన రూ.2 వేల పింఛనే వస్తుందని తెలిపింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ పెంచుతుందనే నమ్మకం లేదని వాపోయింది. కేసీఆర్ అమలు చేసిన రూ.2 వేల పింఛన్తోనే తృప్తిగా బతుకున్నట్టు తెలిపింది.