న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పిపోయారా?.. వాస్తవానికి అలాంటిదేమీ లేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ట్విట్టర్ ప్రకారం ఆయన ఆచూకీ తెలియడం లేదంతే. ప్రస్తుతం ‘అమిత్ షా మిస్సింగ్’ యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెడవుతోంది. దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా హెచ్ఎం (హోం మినిష్టర్) ‘ఎంఐఏ’ (మిస్సింగ్ ఇన్ యాక్షన్) అంటూ పలువురు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా, ఢిల్లీ పోలీసులు బుధవారం జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్ కరియప్ప దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్ఎస్యుఐ కార్యాలయాన్ని సందర్శించారు. ‘ప్రస్తుతం పౌరులు సంక్షోభంలో ఉన్నారు.. అమిత్ షా మహమ్మారి మధ్య అదృశ్యమయ్యారు’ అని ఆరోపించారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాల్సి ఉందని, సంక్షోభ పరిస్థితుల్లో నుంచి పారిపోకూడదని విద్యార్థి నాయకుడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో.. భారత ప్రభుత్వం, బీజేపీకి మాత్రమే కాకుండా దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడం రాజకీయ నాయకుల కర్తవ్యం అని పేర్కొన్నారు.