న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్ వేగంగా కృషి చేస్తోందని, దేశంలోని ప్రతి పౌరుడికి డిసెంబర్ నాటికి టీకాలు వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. కరోనా వైరస్కు వ్యతిరేకంగా జరుగుతున్న టీకా డ్రైవ్ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. టీకాల ఉత్పత్తి, లభ్యతను పెంచేందుకు నిరంతరం కేంద్రం కృషి చేస్తుందని, ప్రతి భారతీయుడికి డిసెంబర్ నాటికి టీకాలు వేస్తారని, ఇదో భారీ రికార్డవుతుందని అని పేర్కొన్నారు. చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు టీకాలను అభివృద్ధి చేసిందన్నారు. దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల నాణ్యత, ప్రామాణికతను ప్రశ్నిస్తూ టీకా డ్రైవ్ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు తమవంతు కృషి చేశాయని విమర్శించారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. అయితే, ఇప్పుడు ఆ వ్యక్తులే టీకా కోసం క్యూ కడుతున్నారన్నారు. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఆంఫోటెరిసిన్-బీ మందులపై స్పందిస్తూ.. దేశం ఇప్పటికే నెలకు 1.5 కోట్ల రెమ్డెసివిర్ ఉత్పత్తి అవుతోందని, ఆంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ల అవసరాన్ని తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. విదేశాల నుంచి ఆంఫోటెరిసిన్ దిగుమతి చేసుకుంటున్నామని, ఇప్పటికే మూడు లక్షల ఇంజెక్షన్లు వచ్చాయని, మరో మూడు రోజుల్లో మూడు లక్షల ఇంజెక్షన్లు వస్తాయని పేర్కొన్నారు. దేశంలో ఆరు ఫార్మా కంపెనీలు ఆంఫోటెరిసిన్ను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో ఐదు కంపెనీలకు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి వివరించారు.