ముంబై : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్న అజాజ్ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బాలీవుడ్ నటుడికి సంబంధం ఉన్న అంధేరి, లోకండ్వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ కేసులో ఫరూఖ్ బటాటాను కూడా నిన్న 8 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన కుమారుడు షాదాబ్ను గత వారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ డ్రగ్స్ కేసులో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేసినందుకు 2020, ఏప్రిల్లో అరెస్టయ్యాడు.
ఇవి కూడా చదవండి..