Adani | న్యూఢిల్లీ, మే 3: అదానీ గ్రూప్ సంస్థలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పార్టీ లావాదేవీలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘనలకుగాను గౌతమ్ అదానీకి చెందిన 7 కంపెనీలకు ఈ నోటీసులు వెళ్లాయి. ఈ మేరకు సదరు సంస్థలు శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపాయి. కాగా, సెబీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఉన్నాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికం, గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లోనూ ఈ విషయాన్ని అదానీ సంస్థలు స్పష్టం చేశాయి. అయితే ఏ రకమైన చట్టాలను, నిబంధనలను తాము అతిక్రమించలేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఇక అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మినహా మిగతా కంపెనీల ఆడిటర్లు ఆర్థిక ప్రకటనలపై క్వాలిఫైడ్ ఒపీనియన్ను జారీ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇష్యూ చేసినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఏసీసీ, అంబుజా సిమెంట్ తమకు సెబీ నుంచి ఏ నోటీసులూ రాలేదని ప్రకటించాయి. ఎన్డీటీవీ కూడా ఇదే ప్రకటన ఇచ్చింది. అదానీ గ్రూప్లో మొత్తం 10 సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన విషయం తెలిసిందే. ఇందులో ఏడింటికి సెబీ నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయి.
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రిసెర్చ్.. అదానీ గ్రూప్ భారీ ఎత్తున అక్రమాలకు, అవకతవకలకు పాల్పడిందని గత ఏడాది జనవరిలో సంచలన నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరల పెరుగుదలకు అదానీ కంపెనీలు అడ్డదార్లు తొక్కాయని ఆ రిపోర్టులో ఆరోపించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే దీని ఆధారంగా సెబీ ఇప్పుడు ఈ షోకాజ్ నోటీసులను ఇచ్చిందని అం టున్నారు. కాగా, షోకాజ్ నోటీసు అంటే నేరారోపణ కానప్పటికీ.. ఆరోపణలపై ఎందుకు న్యాయపరమైన చర్యలు తీసుకోకూడదో కంపెనీలు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మాత్రం ఈ వ్యవహారం సుప్రీం కోర్టుదాకా వెళ్లిందని, నిపుణుల కమిటీ ఎలాంటి అక్రమాలు జరుగలేదని చెప్పిందని, సెబీ కూడా స్టేటస్ రిపోర్టు ప్రకారం 24 అంశాల్లో 22 అంశాలపై దర్యాప్తు జరిపిందని, సుప్రీం కోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని గుర్తు చేసింది.