Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.7డిగ్రీలు, గాలిలో తేమ 24శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మండుతున్న ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పనులను సైతం సాయంత్రానికి లేదా రాత్రికి వాయిదా వేసుకుంటున్నారు. దీంతో పగటిఫూట నిర్మానుష్యంతో పాటు రోడ్లు సాయంత్రం అయ్యేసరికి రద్దీగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.