పనాజీ: దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ప్రాణవాయువు అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గోవాలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం నాలుగు గంటల వ్యవధిలో ప్రాణవాయువు అందక 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయమే కారణమని తెలుస్తోంది. ఘటనపై విచారణ జరపాలని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే బాంబే హైకోర్టును కోరారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా జీఎంహెచ్సీలో మంగళవారం తెల్లవారు జామున 2 నుంచి 6 గంటల మధ్య చాలా మంది రోగులు చనిపోయారని, మరణాలకు కారణం మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. సోమవారం నాటికి ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరాలో లోటుపాట్లు ఉన్న సంగతి నిజమేనని అంగీకరించారు. దీనిపై హైకోర్టు నేరుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. జీహెంసీహెచ్కు 1,200 జంబో సిలిండర్లు అవసరం కాగా.. 400 మాత్రమే సరఫరా అయ్యాయని సమాచారం.
కొవిడ్ రోగుల మృతిపై సమాచారం అందుకున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగినంత ఆక్సిజన్ తెలిపారు. సంక్షోభం ‘దుర్వినియోగం’ కారణంగానేనన్నారు. ఆక్సిజన్ రోగులకు చేరనట్లు కనిపిస్తోందని, బాధ్యతత తీసుకొని సమస్య పరిష్కరిస్తానన్నారు. సిలిండర్ల కేటాయింపులో జాప్యం జరిగిందని, సమస్యను పరిష్కరించేందుకు ఆక్సిజన్ సిలిండర్లు జీఎంసీహెచ్కి అందుబాటులో ఉంచుతామన్నారు. ఎనిమిది రోజుల్లో ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.