మోర్తాడ్, ఏప్రిల్ 26: కందూరు చేద్దామని కమ్మర్పల్లి నుంచి వెళ్లిన ఓ రెండు కుటుంబాల్లో కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం నెలకొంది. వారు వెళ్తున్న వాహనం బోల్తాపడి ఇద్దరు మృత్యువాత పడగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కమ్మర్పల్లికి చెందిన రెంజర్ల స్వామి, రెంజర్ల నర్సయ్య పెద్దగుట్ట వద్ద కందూరు చేసేందుకు డీసీఎం వ్యాన్లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 36 మంది గురువారం రాత్రి బయల్దేరారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గండి వద్ద డీసీఎం బోల్తా పడడంతో రెంజర్ల శ్యాంసుందర్(40), రెంజర్ల వసంత(30) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. 15 మందికి గాయాలు కావడంతో వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు తరలించారు. పెద్దగుట్టకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో కమ్మర్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడి దగ్గరకు వెళ్తూ ఇటువంటి సంఘటన జరగడం గ్రామంలో ఇదే మొదటిసారని స్థానికులు అన్నా రు. మృతుల ఇండ్ల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. డీసీఎం డ్రైవర్ కమ్మర్పల్లిలోనే తాగి ఉన్నట్లు కనిపించాడని, తిరిగి ఆర్మూర్లో మరోమారు వైన్స్లో మద్యం కొనుగోలు చేసి తాగాడని మృతులు, క్షతగాత్రుల బంధువులు తెలిపారు.
వినాయక్నగర్, ఏప్రిల్ 26: డీసీఎం డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంగా నడపడంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయాలతో దవాఖానలో చేరారని నిజామాబాద్ రూరల్ ఎస్సై మహేశ్ తెలిపారు. ఈ ఘటనపై రెంజర్ల స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ ఆమందు కృష్ణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఖలీల్వాడి, ఏప్రిల్ 26 : రూరల్ మండలం మల్లారం గండి వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో శుక్రవారం పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులకు సూచించారు. చనిపోయిన వారికి త్వరగా పోస్టుమార్టం చేయాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని వేముల కోరారు.