హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కృషి ఫలించింది. బతుకు దెరువు కోసం జోర్డాన్ (Jordan) వెళ్లి చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు, రవాణ ఖర్చును భరించి బాధితులను తెలంగాణాకు (Telangana) రప్పించ్చారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన బాధితులు, నేరుగా హరీశ్ రావు ఇంటికి వెళ్లి కలిశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్ని సార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి భారత దేశానికి తీసుకొచ్చిన హరీశ్ రావుకు, బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపిన బాధితులు. ఈ సందర్భంగా హరీశ్ రావు.. వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనే ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్ లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేశామన్నారు. బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నాయి. 12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించి వారికి సాయం అందించాలని కోరాం. మరోవైపు జోర్డాన్ లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసారు. అయినా స్పందన లేదు. అందుకే జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని చెప్పారు.
‘ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతోమంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బీఆర్ఎస్ పార్టీ 12 మందినీ కాపాడి స్వదేశానికి తీసుకువచ్చింది. ఇవ్వాళ రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడ్తా అని, వాళ్లకోసం ప్రత్యక పాలసీ తెస్తామని, నిధులు పెడతామని చెప్పారు. రెండేండ్లయినా రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మన రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్.. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డలను తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మీరు మరిచిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్లందరిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. వలస కార్మికులకు బాసటగా నిలిచింది.’ అని తెలిపారు.
కాగా, జోర్డాన్ వలస కార్మికుల సమస్య తన దృష్టికి రాగానే దాదాపు రెండు వారాల నుంచి వారిని స్వదేశానికి రప్పించేందుకు హరీశ్ రావు ఎంతో కృషి చేశారు. ఒకవైపు జోర్డాన్ వలస కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్, మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకు వెళ్లేందుకు కంపెనీ ఒప్పుకున్నది. దీంతో వలస కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీశ్ రావు భరించారు. ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న వారిని ప్రత్యేక వాహనాల్లో సొంతుళ్లకు తరలించారు.
❇️ ఫలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారి కృషి..
❇️ సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు.♦️ బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస… pic.twitter.com/qtn7RgaEr7
— BRS Party (@BRSparty) October 25, 2025