న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రెండు నెలల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు ఇంత తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా మరో 1,89,232 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 2,677 మంది వైరస్ బారినపడి మృతి చెందారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,09,339కు పెరిగాయి.
ఇందులో 2,69,84,781 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,46,759 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్లో మొత్తం 23,13,22,417 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. జాతీయ రికవరీ రేటు 93.67శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 6.54శాతానికి చేరిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 5.62 శాతంగా ఉందని తెలిపింది. వరుసగా 13 రోజుల్లో పది శాతానికంటే తక్కువగా నమోదైందని వివరించింది.