కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ వైఫల్యం కారణంగా దోమల బెడదతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తు న్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. ఒంటినిండా దోమతెరను ధరించి, ఫాగింగ్ యంత్రంతో మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ హాల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ను మూడు ముక్కలుగా విభజించి మరిన్ని సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. నగరాన్ని మురికికూపం చే సి దోమలకు నిలయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దోమలతో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సమయంలో మాస్క్ ఎలా ధరించామో, ఇప్పుడు దోమల బెడద తట్టుకోలేక మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దోమల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చే పట్టకపోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. దోమలను కూడా అరికట్టలేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ ఇమేజ్కి డ్యామేజ్ కలుగుతుందని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో దోమల బెడత తీవ్రంగా ఉందని, అందుకు సర్కారే కారణమంటూ నిరసనగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి దోమ తెర ధరించి అసెంబ్లీ హాల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దోమ తెరతో వచ్చిన సుధీర్రెడ్డిని అక్కడ ప్రెస్మీట్ పెట్టకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనపై మార్షల్స్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.