రామచంద్రాపురం, ఫిబ్రవరి 7: ఒక్కప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరస్వతీ నిలయంగా మార్చారు ప్రధానోపాధ్యాయులు సిద్ధా ప్రతాప్రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్) 2011కి ముందు అధ్వాన స్థితిలో ఉండేది. తరగతి గదుల తలుపులు, కిటికీలు విరిగి, గోడలు వర్షపు నీటితో తడిసి పాకుర్లతో పాడుబడిన భవనాన్ని తలపించేది. 2011లో హెచ్ఎం ప్రతాప్రెడ్డి బదిలీపై ఆర్సీపురం ప్రైమరీ స్కూల్కి రావడంతో పాఠశాలకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. స్కూల్లో ఛార్జీ తీసుకొని అప్పటి నుంచి స్కూల్ అభివృద్ధికి కృషి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎన్జీవోలు, దాతలను కలిసి స్కూల్ పరిస్థితిని వివరించి వారి సహకారంతో పాటు ప్రభుత్వ పెద్దల సహకారం తీసుకొని అభివృద్ధి చేశారు. హెచ్ఎం ప్రతాప్రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రైమరీ స్కూల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. 2011కి ముందు ఆ స్కూల్ అంటేనే భయపడిన వారు, ఇప్పుడు ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రైమరీ స్కూల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. ప్రస్తుతం స్కూల్లో 470 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 50 మంది విద్యార్థులు ఉర్దూ మాధ్యమానికి సంబంధించిన వారు ఉన్నారు. స్కూల్లో ఇంగ్లిష్ మీడియం బోధన మాత్రమే చేస్తున్నారు. అడ్మిషన్లు ఫుల్ అయినా పిల్లలను స్కూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు వస్తున్నారు. ఒక్కో తరగతికి 70 మంది విద్యార్థుల చొప్పున ఉన్నారు.
ప్రైమరీ స్కూల్ ప్రత్యేకతలు..
ప్రాథమిక పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్రెడ్డి అన్నివిధాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. స్కూల్లో గార్డెన్, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, తరగతి గదులు, డిజిటల్ క్లాస్రూం, కంప్యూటర్ ల్యాబ్, ఇలా అన్ని సౌకర్యాలను కల్పించారు. ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తగ్గకుండా ప్రైమరీ స్కూల్ని అభివృద్ధి చేశారు. ఎంఏక్యూ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన నవీన్పిల్లే, ప్రియ ప్రతినిధుల సహకారంతో స్కూల్లో డిజిటల్ క్లాస్రూం, లైబ్రరీ, టాయిలెట్స్, స్పోర్ట్స్ కిట్లను సమకూర్చారు. ఎన్జీవోల సహకారంతో స్కూల్కి ఆరు కంప్యూటర్లు, టీవీ, ప్రొజెక్టర్, విద్యార్థులకు షూలను తీసుకువచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని స్కూల్ని అభివృద్ధి చేశారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం భేష్..
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలనే సీఎం కేసీఆర్ ఆలోచన పేద విద్యార్థులకు వరం. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్తోనే భవిష్యత్ ఉంది. ఇంగ్లిష్ మీడియం సాకుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇప్పుడు సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం మొదలుకావడంతో అందరూ సర్కారు బడికి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తున్నాం. ప్రస్తుతం స్కూల్లో 470 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాతల సహకారంతో స్కూల్ని అభివృద్ధి చేశాం.
– హెచ్ఎం సిద్దా ప్రతాప్రెడ్డి
స్కూల్లో టీచింగ్ బాగుంది..
టీచర్లు టీచింగ్ బాగా చేస్తుండ్రు. స్కూల్లో టాయిలెట్స్, వాటర్, ప్లేగ్రౌండ్ అన్ని ఉన్నాయ్. డిజిటల్ క్లాస్లు, టీవీ క్లాస్లను టీచ్ చేస్తుండ్రు. ప్రిన్సిపాల్ అన్ని క్లాస్ రూంలకు తిరుగుతూ మాకు డిసిప్లేన్ను నేర్పిస్తుంటారు. ప్రైవేట్ స్కూల్ కంటే మా స్కూలే బాగుంటుంది. స్పోర్ట్స్ కూడా ఆడిపిస్తుంటారు. బాగా చదువుకుంటున్నాం. స్కూల్లో మాకు ఏలోటు లేదు. అన్ని ప్రిన్సిపాల్ సార్ చూసుకుంటాడు.
– సాయి, 5వ తరగతి విద్యార్థి