ఝరాసంగం, ఏప్రిల్ 23: సామాన్య కుటుంబంలో పుట్టి సాగుపై మక్కువతో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఝరాసంగం మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీశైలం ప్రతిభ చాటారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక పరీక్షల ఫలితాల్లో (ఏఎస్ఆర్బీ) వ్యవసాయ శాస్త్రవేత్తగా ఆయన ఉద్యోగం సాధించారు. నాన్లోకల్ విభాగంలో ఆయనకు అరుణాచల్ప్రదేశ్ కేడర్ను కేటాయిస్తూ ఏఎస్ఆర్బీ సోమవారం ఫలితాలు ప్రకటించింది.
గ్రామీణ ప్రాంతానికి చెందిన శ్రీశైలం విద్యాభ్యాసం జడ్పీహెచ్ఎస్ ఝరాసంగం, ఇంటర్మీడియట్ డీఆర్డీవో ద్వారా నారాయణ కళాశాల, గ్రాడ్యుయేషన్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బనారస్ హిందూ యూనివర్సిటీ, పీహెచ్డీ తిరుపతిలోని వేంకటేశ్వర యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ… ఈ విజయం వెనుక తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఉపాధ్యాయులు, మిత్రుల సహకారం ఉందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా రైతులకు మేలు చేసేలా తన పరిశోధనలు కొనసాగిస్తానన్నారు. డాక్టర్ శ్రీశైలంకు గ్రామస్తులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.