ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన కామెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాసిక్ పోలీసులు ఇప్పుడు రాణెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ, శివసేన మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. నాసిక్లో శివసేన కార్యకర్తలు బీజేపీ ఆఫీస్పై రాళ్ల దాడి చేయగా.. ముంబైలో రెండు పార్టీల వాళ్లు బాహాబాహీకి దిగారు.
అసలేం జరిగింది?
రాయ్గఢ్ జిల్లాలో సోమవారం నారాయణ్ రాణె జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాదిలో వచ్చిందో తెలియని ఉద్ధవ్ థాక్రేను తాను కొడదామనుకున్నా అని రాణె అన్నారు. స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గు చేటు. ఆయన ప్రసంగం సందర్భంగా ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కనుక్కొని మరీ చెప్పారు. ఒకవేళ నేను అక్కడే ఉండి ఉంటే.. ఆయనను గట్టిగా కొట్టేవాడిని అని నారాయణ్ రాణె అన్నారు.
ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండిపడింది. సోమవారం రాత్రే కేంద్ర మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయన కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్లో ఉండటంతో రాణెను అరెస్ట్ చేయడానికి నాసిక్ పోలీసులు అక్కడి వెళ్లారు. ఈ వివాదంపై నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఇప్పటికే కేంద్ర మంత్రిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఓ బృందం వెళ్లింది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కోర్టులో హాజరు పరుస్తాం. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం అని కమిషనర్ అన్నారు.