Siddaramaiah | కర్ణాటక ఎక్సైజ్ శాఖ (Karnataka excise department)లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ఆ ఆరోపణలను నిరూపించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమని రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని (down from politics) ప్రకటించారు. నిరూపించలేకపోతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, ఆ సొమ్మును మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. ‘ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాజ కుటుంబానికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు ఏటీఎంలుగా మారిపోయాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నది. మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెప్తున్నారు. కర్ణాటకలోని లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.’ అని మోదీ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మోదీ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ఈ దేశ ప్రధాని ఇంత అబద్ధాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ‘మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి పాల్పడిందని మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు రూ.700 కోట్లు సమీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశ ప్రధాని ఇంత అబద్ధాలు చెప్పడం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈరోజు నేను ప్రధానికి ఓ సవాల్ విసురుతున్నా. ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించకపోతే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి’ అని సిద్ధరామయ్య అన్నారు.
కాగా, కర్ణాటక వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇటీవల ఎక్సైజ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ను లక్ష్యంగా చేసుకుంది. లైసెన్సులు మంజూరు చేసేందుకు, ట్రాన్స్ఫర్ల కోసం రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆరోపించింది. గత ఏడాది కాలంలో ఇలా 1000 లైసెన్సులను అక్రమంగా కేటాయించారని, ఫలితంగా రూ. 300-700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది.
Also Read..
Onion Price | మరింత ఘాటెక్కిన ఉల్లి.. కిలో ఎంతంటే..?
Justice Sanjiv Khanna | సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా