Changes In Railways | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మాసం ముగిసింది. నేటి నుంచి జులై ప్రారంభం అయ్యింది. అయితే, జులై ఒకటి నుంచి పలు కీలక రూల్స్ మారిపోయాయి. ఇందులో పాన్కార్డ్ నుంచి బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డుల వరకు రూల్స్ ఉన్నాయి. అయితే, నేటి నుంచి రైల్వేలో కీలక మార్పులు (Changing In Railways) అమల్లోకి వచ్చాయి. ఇందులో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..
పెరగనున్న రైలు టికెట్ చార్జీలు..
నేటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్లలో కిలోమీటరుకు రెండు సైసలు, నాన్ ఏసీ క్లాస్లో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. నూతన ఛార్జీల పట్టికను సోమవారం రైల్వే శాఖ విడుదల చేసింది. 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ ఛార్జీలు పెరిగాయి. నాన్ ఏసీ (స్లీపర్, సెకండ్ సీటింగ్) కేటగిరిల్లో టికెట్పై కిలోమీటర్కు ఒక పైసా, థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీ వరకు అన్ని క్లాస్లలో కిలోమీటర్కు 2 పైసలు పెరిగింది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి సెకండ్ క్లాస్ రైలు టికెట్ల ధరలు, ఎంఎస్టీలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ, 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే.. ఆ ప్రయాణికులు ప్రతి కిలోమీటర్కు అర పైసా చెల్లించాల్సి ఉంటుంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ ఇక కఠినం..
రైల్వేశాఖ జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ను కఠినతరం చేసింది. ఇకపై తత్కాల్ టికెట్లు ఐఆర్సీటీసీ అకౌంట్తో ఆధార్ లింక్ చేసిన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నేటి నుంచి ఓటీపీ ఆధారిత అథంటికేషన్ తప్పనిసరి చేసింది. దాంతో ఆధార్ అకౌంట్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలో రైల్వే ఏజెంట్లు బుకింగ్ చేసేందుకు అనుమతి ఉండదు. ఏజెంట్లు పెద్ద ఎత్తున టికెట్లను బుక్ చేస్తున్నారని విమర్శల నేపథ్యంలో ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. దాంతో ప్రయాణికులకు ఊరట కలుగనున్నది.
ఎనిమిది గంటల ముందే రైల్వే చార్ట్ సిద్ధం..
టికెట్ల రిజర్వేషన్లలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వేలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైళ్లు బయలుదేరడానికి ఎనిమిదిగంటల ముందే రిజర్వేషన్ చార్టులను (Reservation Charting) సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. అంటే మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే రైలు రిజర్వేషన్ చార్టులు ముందు రోజు రాత్రి 9గంటలకు సిద్ధం చేయబోతున్నది. వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ మరింత ముందుగానే తెలియడంతో దూర ప్రాంతాలు.. శివారు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయోజన కరంగా ఉంటుందని రైల్వే భావిస్తున్నది.
వెయిట్లిస్ట్ నిర్ధారించబడకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు మరింత సమయం ఉండనున్నది. కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా ఇప్పుడు నిమిషానికి 1.5 లక్షలకు పైగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. దాంతో పాటు, జులై ఒకటి నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్కు సంబంధించి మార్పులు ఉంటాయి. ఇకపై అథెంటికేషన్ యూజర్స్ మాత్రమే తత్కాల్ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. దాంతో పాటు జులై చివరి నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం వన్ టైమ్ పిన్ (OTP) ఆధారిత వెరిఫికేషన్ జరుగనున్నది. ఈ ఆన్లైన్ అథంటికేషన్ ప్రక్రియలో యూజర్లు డిజి లాకర్ అకౌంట్ సహాయం తీసుకోవచ్చు. డిజిలాకర్, ఏదైనా ఇతర ప్రభుత్వ ఐడీలో సేవ్ చేయబడిన ఆధార్ కార్డ్ డేటాను ధృవీకరణ కోసం ఉపయోగించవచ్చని రైల్వేశాఖ పేర్కొంది.
వెయిటింగ్ లిస్ట్ పరిమితి 60 శాతానికి పెంపు
ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ (Waiting List) పరిమితిని అన్ని ఏసీ తరగతులకు 25 నుంచి 60 శాతానికి, నాన్ ఏసీ తరగతుల్లో 30 శాతానికి పెంచుతూ రైల్వే శాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సవరించిన సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) ఉత్తర్వులు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 17న జారీచేసిన సీఆర్ఐఎస్ ఉత్తర్వుల ప్రకారం, అన్ని తరగతుల్లో ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ పరిమితిని 25 శాతానికి పరిమితం చేశారు.
Also Read..
INS Tamal: భారతీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక.. ఇవాళే ఐఎన్ఎస్ తమల్ జలప్రవేశం
Online Transfers: ఐఎంపీఎస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై కొత్త ఛార్జీలు..