కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను జులై 15 వరకూ పొడిగించింది. జులై ఒకటి నుంచి కొన్ని సడలింపులతో నియంత్రణలను కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. సడలింపులతో లాక్డౌన్ను జులై 15 వరకూ పొడిగించినట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ఇక సడలింపుల్లో భాగంగా జిమ్లు, సెలూన్లు, బ్యూటీపార్లర్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ అనుమతిస్తారు.
ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలను యాభై శాతం సిబ్బందితో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అనుమతిస్తారు. ఇక అన్ని మార్కెట్లు, షాపులను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచేందుకు అనుమతించారు. ప్రజా రవాణాలో భాగంగా బస్సులు సగం సీట్లతో రాకపోకలు నిర్వహించే వెసులుబాటు కల్పించారు.