Vistara flight | జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. 134 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బందితో విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన 787 బోయింగ్ విమానం మంగళవారం రాత్రి 8:20 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంక్ఫర్ట్ (Frankfurt) నుంచి ముంబైకి (Mumbai) బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం 7.45 గంటలకు ఆ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయినట్లు విస్తారా అధికారి తెలిపారు. అనంతరం విమానాన్ని భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ రన్వేకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దేశంలో విమానాలకు వరుసగా వస్తున్న బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో 19 విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
3 రోజుల్లో 19 విమానాలకు బెదిరింపులు
దేశంలో విమానాలకు వరుసగా వస్తున్న బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో 19 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల కారణంగా బుధవారం రియాద్ వెళ్లే ఇండిగో విమానాన్ని మస్కట్కు దారి మళ్లించారు. 177 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే బాంబు బెదిరింపు రావడంతో తిరిగి ఢిల్లీకి రప్పించారు. అలాగే ఇండిగోకు చెందిన ముంబై-ఢిల్లీ ఫ్లైట్కు కూడా ఇలాంటి బెదిరింపే రావడంతో అహ్మదాబాద్కు మళ్లించి ల్యాండ్ చేశారు. ఇదే విధంగా మంగళవారం ఏడు విమానాలకు, సోమవారం మూడు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. బాంబు బెదిరింపులకు సంబంధించి 17 ఏండ్ల బాలుడితో పాటు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్మార్షల్స్ రెట్టింపు!
విమాన బెదిరింపుల ఘటనలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమై చర్చించింది. అంతకుముందు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు డీజీసీఏ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు 30 వరకు ఇలాంటి బాంబు బెదిరింపులు రాగా, 11 విమానాలపై వాటి ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు. విమానాలలో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొన్ని అంతర్జాతీయ, సున్నితమైన దేశీయ రూట్లలో ఎన్ఎస్జీ కమాండోలను ఎయిర్మార్షల్స్గా ఉంచనున్నారు. విమానాశ్రయాలలో భద్రతను పెంచనున్నారు.
17 ఏండ్ల బాలుడి అరెస్ట్
కాగా, విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడ్డ 17 ఏళ్ల మైనర్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారస్తుడైన అతని తండ్రికి సమన్లు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు. తన స్నేహితుడితో డబ్బు విషయంపై జరిగిన వివాదంతో అతనిపై కక్ష తీర్చుకోవడానికి ఛత్తీస్గఢ్ రాజ్నంగ్గావ్కు చెందిన ఈ బాలుడు అతని పేరుపై నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం ఈ బాలుడు చేసిన బెదిరింపుల వల్ల నాలుగు విమానాలకు అంతరాయం ఏర్పడింది.
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 15వ ఘటన
Petrol bomb | శివ సేన నేత ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
Snake | కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. వీడియో వైరల్