Viral news : వివాహిత అయిన యువతితో ఓ యువకుడు వివాహేతర బంధం సాగిస్తున్నాడు. తరచూ రాత్రి వేళల్లో అమె ఉంటున్న గ్రామానికి వెళ్లి కలిసి వస్తున్నాడు. ఎప్పటిలాగే ఇటీవల కూడా కాపాలా కోసం తన ఇద్దరు స్నేహితులను తీసుకుని అర్ధరాత్రి ఆ గ్రామంలోకి ప్రవేశించాడు. ముగ్గురూ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో వారిని దొంగలుగా భావించిన గ్రామస్తులు చుట్టుముట్టారు. దాంతో భయపడ్డ అతడి స్నేహితులు పారిపోయారు. అతడు మాత్రం గ్రామస్తుల చేతిలో తీవ్రంగా తన్నులు తిన్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం హాపూర్ జిల్లా (Hapur district) లోని అమ్రోహా (Amroha) లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అమ్రోహా గ్రామంపై ఇటీవల ఓ డ్రోన్ తిరుగుతూ కనిపించింది. దాంతో దొంగలు డ్రోన్ సాయంతో దొంగతనాలకు టార్గెట్లను గుర్తించి దోపీడీలకు పాల్పడుతున్నారనే వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో గ్రామస్తులు గత కొన్ని రోజులుగా దొంగలను పట్టుకునేందుకు గస్తీ కాస్తున్నారు. ఇది తెలియని యువకుడు అదే గ్రామానికి చెందిన తన వివాహిత ప్రేయసిని కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లాడు. వెంట ఇద్దరు స్నేహితులను కాపాలాగా తీసుకెళ్లాడు. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ ముగ్గురూ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటాన్ని గస్తీ కాస్తున్న గ్రామస్తులు చాటుగా ఉండి గమనించారు. అప్పటికే ప్రియురాలి ఇంటిని సమీపించిన యువకుడిపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడి చేశారు. ఇది గమనించి అక్కడి కొద్ది దూరంలో ఉన్న యువకుడి స్నేహితులు పారిపోయారు. చేతికి చిక్కిన యువకుడిని అర్ధరాత్రి ఎందుకు వచ్చావని నిలదీయగా ప్రియురాలి విషయం బయటపడకుండా ఉండేందుకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
దాంతో అతడు కచ్చితంగా దొంగేనని నిర్ధారించుకున్న గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. అతడు దొంగ కాదని నిర్ధారించుకున్న తర్వాత మరోసారి అర్ధరాత్రిపూట ఆ గ్రామంలోకి వెళ్లనని సదరు యువకుడితో హామీ రాయించుకుని విడిచిపెట్టారు. మాటతప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.