న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. (Use piped gas) లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని కోసం మూడు నెలలు గడువు ఇచ్చింది. మార్చి 24న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్పు ఐచ్ఛికం కాదని, తప్పని సరి అని స్పష్టం చేసింది.
కాగా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్జీ) అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధీకృత సంస్థ ఎల్పీజీ వినియోగదారులకు సమాచారం ఇస్తుంది. ఆ సమాచారం అందిన తేదీ నుంచి మూడు నెలలోపు తప్పని సరిగా పీఎన్జీకి మారాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ ఇంటికి ఎల్పీజీ సరఫరా నిలివేస్తారు. అయితే పీఎన్జీ కనెక్షన్ అందించడం సాంకేతికంగా అసాద్యమైతేనే ఎల్పీజీ సరఫరా కొనసాగుతుంది. దీని కోసం పీఎన్జీ సరఫరా సంస్థ జారీ చేసే నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉన్నది.
మరోవైపు గ్యాస్ పైప్లైన్ల ఏర్పాటు వేగవంతం, నిర్దిష్ట కాలపరిమితిలోగా అనుమతులు మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎన్జీ కనెక్షన్ను 48 గంటలలోపు అందించాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదని ఆయా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈ మేరకు కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
Also Read:
Custodial Deaths | ఈ ఏడాది తొలి 74 రోజుల్లో.. 170 కస్టడీ మరణాలు
MBBS Student Suicide | ఆన్లైన్ గేమ్లో డబ్బులు కోల్పోయి.. ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
Watch: భారీ గడ్డి లోడ్తో వెళ్తున్న లారీ.. అదుపుతప్పి ఊగిపోతూ బోల్తా