న్యూఢిల్లీ: ఒక ప్రేమ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. పెళ్లి కోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను చంపుతామని తన కుటుంబ సభ్యులు బెదిరించినట్లు యువతి ఆరోపించింది. తమకు రక్షణ కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆ జంట కోరింది. (Runaway Couple Reaches Supreme Court) బీహార్కు చెందిన 19 ఏళ్ల యువతి, ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి ఢిల్లీకి పారిపోయారు. పెళ్లి కోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆ జంట ఆశ్రయించింది.
కాగా, శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులోని పార్కింగ్ ఏరియాలో న్యాయవాది హర్విందర్ చౌదరిని ఆ జంట కలిసింది. ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తన తండ్రి, సోదరుడు తమను ఉరి తీస్తామని బెదిరించినట్లు యువతి ఆరోపించింది. సహాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లగా తమను అదుపులోకి తీసుకున్నారని ఆ యువతీ, యువకుడు వాపోయారు. కొన్ని జంటలు కోర్టులో పెళ్లి చేసుకోవడాన్ని సోషల్ మీడియా రీల్స్ ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్లు ఆయనకు చెప్పారు. దీంతో న్యాయవాది హర్విందర్ చౌదరి ఆ జంట తరుఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యువతి కుటుంబం బెదిరింపుల నేపథ్యంలో ఆ జంటకు మూడు రోజులు రక్షణ కల్పించాలని కోరారు.
మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్ను పరిశీలించింది. తక్షణ ఉపశమనం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఆ జంటకు సూచించింది. ‘హైకోర్టు దీనిని తప్పకుండా పరిశీలిస్తుంది. పంజాబ్, హర్యానా హైకోర్టులో నేను ఉన్నప్పుడు ఇలాంటి కేసులు చాలా చూశాను. ఒకవేళ హైకోర్టు దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, అప్పుడు మీరు మా వద్దకు రావచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. ‘ఢిల్లీ హైకోర్టు దీనిని ఈ రోజే పరిగణనలోకి తీసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా హైకోర్టు రిజిస్ట్రార్కు తెలియజేస్తాం’ అని ఆ జంటకు భరోసా ఇచ్చారు.
Also Read:
Veterinarian Dies in Hippo Attack | ఆరోగ్య పరీక్షల సమయంలో నీటి గుర్రం దాడి.. పశువైద్యురాలు మృతి
Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Watch: శవాల మాదిరిగా నీటిలో తేలిన జంట.. వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్