న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. మొదటి వేవ్తో పోల్చితే రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో భారత్లో థర్డ్వేవ్ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కొవిడ్ మూడో వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని చెప్పారు. అన్లాక్ కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దాంతో వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుందని ఆయన తెలిపారు.
కొవిడ్ హాట్స్పాట్లలో తగిన నిఘా ఉంచడం అవసరమని చెప్పారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్కు, డోస్కు మధ్య అంతరం తగ్గించడం సవాల్గా మారిందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటి, రెండో వేవ్ల నుంచి ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్లాక్ చేయడంతో జనం కనీస కొవిడ్ నిబంధనలు కూడా పాటించడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగడం ఖాయమని డాక్టర్ రణ్దీప్ గులేరియా హెచ్చరించారు.