Padma Rao Goud | బేగంపేట, ఏప్రిల్ 25: సమష్టిగా పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ…సామాన్య కార్యకర్త నుంచి తాను ఎదిగానని చెప్పారు.
బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన నిధులన్నీ ల్యాప్స్ అయ్యాయన్నారు. జై శ్రీరాం, జై మోదీ అని చెప్పుకుంటూ కిషన్రెడ్డి ఓట్లు అడుగుతున్నారన్నారు. ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫాంతో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఉన్న పదవి కూడా పోతుందన్నారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పద్మారావుగౌడ్కు మద్దతుగా ఈ నెల 27 నుంచి సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, ప్రభాకర్రావు , స్థానిక కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మీబాల్రెడ్డి, హేమలత తదితరులు పాల్గొన్నారు.