పాట్నా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్పై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav ) సోమవారం స్పందించారు. లాండ్ ఫర్ జాబ్స్ స్కామ్, మనీలాండరింగ్ ఆరోపణలపై తమ నివాసాల్లో శనివారం జరిపిన తనిఖీల్లో కోటి నగదు, రూ.600 కోట్ల విలువైన ఆర్థిక నేరాలను గుర్తించినట్లు ఈడీ ప్రకటించడంపై మీడియాతో ఆయన మాట్లాడారు. ‘సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక నా ముఖం అదానీ మాదిరిగా ఉందా? అని ప్రశ్నించారు. ‘నేను నిజమైన అదానీనా’ అని ఎద్దేవా చేశారు. తనిఖీలు నిర్వహించిన ఈడీ అనంతరం సీజ్ చేసిన జాబితాను బహిర్గతం చేయాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. ‘నా ఇంటి నుంచి కోట్లలో డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ జాబితాను బయట పెట్టాలని నేను సవాల్ చేస్తున్నా. లేక పోతే ఆ జాబితాను నేనే వెల్లడిస్తా’ అని పాట్నాలో మీడియాతో అన్నారు.
కాగా, రైడ్స్ అనంతరం రూ.600 కోట్ల ఆర్థిక నేరాలను గుర్తించినట్లు ఈడీ చేసిన ఆరోపణలను తేజస్వి యాదవ్ ఖండించారు. ఇది తప్పుడు ప్రచారమని అన్నారు. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, కార్పొరేట్ మోసాలకు సంబంధించిన ఆరోపణలున్న గౌతమ్ అదానీ గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘నేనే అసలు అదానీ అన్నట్లుగా దర్యాప్తు ఏజెన్సీలు వెంబడిస్తున్నాయి. సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక అదానీతో నా ముఖం పోలి ఉందా?’ అని ప్రశ్నించారు. అదానీకి సంబంధించిన రూ.80,000 కోట్ల కుంభకోణాన్ని సీబీఐ, ఈడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే చాలా ఏళ్లుగా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి తమ ఇళ్లపై రైడ్ చేస్తున్నా, వారికి ఏమీ లభించడం లేదని అన్నారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేస్తున్నదని విమర్శించారు. రూ.600 కోట్ల కొత్త కథనాన్ని అల్లే ముందు, గత ఆపరేషన్ లెక్కలను సరి చూసుకోవాలని ఆ ఏజెన్సీలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈడీ దాడుల తర్వాత తాను సంతకం చేసిన జప్తు జాబితాని బయటపెడితే బీజేపీ ఇబ్బంది పడుతుందని వ్యాఖ్యానించారు.
#WATCH | In 2017 in the same style they did this…people are saying, a lot of wealth has been recovered from me, 'thenga mila hai' I can challenge them…They first use to say Benami, why don't they say it now?…: Bihar Dy CM Tejaswi Yadav pic.twitter.com/DaTB4tJEOR
— ANI (@ANI) March 13, 2023