లక్నో: ఒక వ్యక్తి తన తండ్రిని దారుణంగా హత్య (Man Kills Father) చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని ట్రాలీబ్యాగ్లో ఉంచి పడేశాడు. ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ సంఘటన జరిగింది. తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీకి చెందిన 30 ఏళ్ల సంతోష్ కుమార్ గుప్తా అలియాస్ ప్రిన్స్ శనివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న 62 ఏళ్ల తండ్రి మురళీ ధర్ గుప్తాను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇచ్చేందుకు తండ్రి నిరాకరించడంతో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహంతో తొలుత కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత సుత్తితో తండ్రి తలపై కొట్టాడు. ఆపై కత్తితో ఆయన గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత సోదరుడి గది నుంచి ట్రాలీ బ్యాగ్ తెచ్చాడు. అందులో పట్టేలా తండ్రి మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను అందులో ఉంచి బైక్పై తీసుకెళ్లి ఇంటి వెనుక ఉన్న వీధిలో పడేశాడు.
కాగా, అన్న సంతోష్ హడావుడిగా బైక్పై వెళ్లడాన్ని తమ్ముడు ప్రశాంత్ గుప్తా గమనించాడు. ఇంట్లో రక్తం మరకలు ఉండటం, తండ్రితో పాటు తన ట్రాలీబ్యాగ్ కనిపించకపోవడంతో ఏదో జరిగినట్లు అనుమానించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. సంతోష్ను ఆరా తీయగా తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనకు డబ్బులు ఇచ్చి ఉంటే తండ్రిని హత్య చేసి ఉండేవాడిని కాదని పోలీసులకు చెప్పాడు.
మరోవైపు మురళీ ధర్ గుప్తా శరీర భాగాలున్న ట్రాలీబ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోదరుడు ప్రశాంత్ గుప్తా ఫిర్యాదు మేరకు నిందితుడు సంతోష్ కుమార్ గుప్తాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.