న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన వందే భారత్ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నది. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది.. వంటి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ సమీపంలో శనివారం ఎద్దును ఢీకొట్టింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బతిన్నది. వరుస ప్రమాదాల నేపథ్యంలో రైలు నాణ్యతపై అనుమానాలు వస్తుండటంతో భద్రతపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఆరు మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైలు 68 సార్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు చోటుచేసుకొన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ 14న లోక్సభలో వెల్లడించారు. గాంధీనగర్-ముంబై రూట్లో వందేభారత్ రైలుకు రెండు నెలల వ్యవధిలోనే ఐదు సార్లు ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది అక్టోబర్ 6, 7, 29, నవంబర్ 8, డిసెంబర్ 1 తేదీల్లో ఈ రైలు ప్రమాదానికి గురైంది. నవంబర్ 8న ట్రాకును దాటుతున్న 54 ఏండ్ల ఓ మహిళను రైలు ఢీకొనడంతో ఆమె మరణించింది. అంతకుముందు ఆవు, బర్రెలను ఢీకొన్న ఘటనలు జరిగాయి. డిసెంబర్ 27న ఉనా-ఢిల్లీ మార్గంలో ఢీకొట్టిన ఘటనలో మూడేండ్ల పాప మరణించింది.
నాణ్యతపై అనుమానాలు
వరుస ప్రమాదాల నేపథ్యంలో రైలు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏంటి? చిన్న ఘటనలకే రైలు ముందు భాగం ధ్వంసమవుతుండటంతో ప్రమాణికుల భద్రతపై అనుమానాలు వస్తున్నాయి.
బర్రె గుద్దినా పచ్చడయ్యే రైలు : కేసీఆర్
ప్రధాని మోదీ గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైలు బర్రె గుద్దినా పచ్చడి అవుతున్నదని గతనెల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. శతాబ్ది, రాజధాని పేరుతో అనేక రైళ్లు వచ్చినా, అరుదైన సందర్భం ఉంటే తప్ప ఎప్పుడూ నేరుగా ప్రధాని ప్రారంభించలేదని చెప్పారు. కానీ బర్రె గుద్దితే పచ్చడయ్యే రైలును ప్రధాని 14 సార్లు ప్రారంభించారని ఎద్దేవా చేశారు.