Sushil Kumar Shinde | 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత (senior leader) కీలక ప్రకటన చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు (retires from active politics).
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే (Sushil Kumar Shinde) రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయసు 82 ఏళ్లు. అయితే, రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ మేరకు నేషనల్ ఛానెల్తో షిండే మాట్లాడుతూ.. ‘నేను క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడల్లా అందుబాటులోనే ఉంటాను. రెండేళ్ళ క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తేమీ లేదు’ అని వెల్లడించారు. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సోలాపూర్ (Solapur) నియోజకవర్గం నుంచి తన కూతురు ప్రణితి షిండే (Praniti Shinde) పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
‘నేను సోలాపూర్ నుంచి పోటీ చేసేవాడిని.. ఇక ఇప్పుడు ఆ స్థానం నుంచి నా కూతురు ప్రణితి షిండే పోటీ చేయాలనేది నా కోరిక. ఇదే విషయాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. అయితే, చివర్లో ఎవరు పోటీ చేయాలనేది ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలన్న తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు’ అని షిండే చెప్పుకొచ్చారు. కాగా, షిండే కూతురు 42ఏళ్ల ప్రణితి షిండే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే సోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు.
Also Read..
Ola Scooter | హాట్ కేకుల్లా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు.. ప్రతి 10 సెకండ్లకో బైక్
Ranbir Kapoor | సినిమాలకు లాంగ్ బ్రేక్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎందుకంటే..?