న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఇంట్లో వాళ్లు అందరూ కలిసి భోజనం చేయాలని పెద్దవాళ్లు ఎప్పుడూ చెప్తుంటారు. ఈ పరుగుల ప్రపంచంలో వారి మాటను పట్టించుకోవడానికి తీరికెక్కడిది.. ఎప్పుడు వీలైతే అప్పుడు తింటాం. అయితే అనారోగ్యానికి ఇదీ ఓ కారణమేనని బ్రిటన్కు చెందిన వెబ్సైట్ Money.co.uk అధ్యయనంలో తేలింది. ఏదైతే అది, ఎప్పుడంటే అప్పుడు తినే ఫాస్ట్ఫుడ్ కల్చర్ ఉన్న దేశాలతో పోల్చితే కుటుంబమంతా కలిసి ఆహారాన్ని తీసుకొనే సంస్కృతి ఉన్న దేశాల ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. అందరూ కలిసి తినే సమయంలో మాట్లాడుకోవడం వల్ల మానసిక సమస్యలు తలెత్తే ముప్పు తగ్గుతుందని, సంతోషకర వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. అనేక దేశాల్లో అధ్యయనం నిర్వహించి ఈ వెబ్సైట్ ఆరోగ్యకరమైన దేశాల జాబితాను రూపొందించింది. ఇందులో టాప్ దేశాలన్నీ.. కలిసి తినడం, ఆహార నియమాలు పాటించడం లాంటి సంస్కృతి ఉన్న దేశాలే కావడం విశేషం. స్పెయిన్ ప్రపంచంలోకెల్లా ఆరోగ్యవంతమైన దేశమని ఈ వెబ్సైట్ వెల్లడించింది. అందరూ కలిసి తినడం, ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనాల కంటే నడవడానికే మొగ్గు చూపడం లాంటి వాటి వల్ల స్పెయిన్ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. వారిలో ఊబకాయం తక్కువ అని పేర్కొన్నది. ఈ వెబ్సైట్ ప్రకారం అమెరికా అనారోగ్యకరమైన దేశాల జాబితాలో ఉన్నది. ఆరోగ్యకరమైన దేశాల జాబితాలో బ్రిటన్ 20వ స్థానంలో ఉంది. ఇక్కడ 67 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని దీనికి మద్యం, అతిగా తినడమే కారణమని వెబ్సైట్ పేర్కొన్నది. వెబ్సైట్ ప్రకారం టాప్ స్థానాల్లో.. స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, ఐస్ల్యాండ్ నిలిచాయి.
ఇవీ కూడా చదవండీ…
ధాన్యం కొనుగోలుకు భారీ ఏర్పాట్లు
దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!