ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 11 కొనుగోలు కేంద్రాలు
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 8: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో యాసంగిలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు పూర్తిస్థాయిలో గిట్టుబాటుధర అం దించడం కోసం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి వ్యవసాయ, మార్కెటింగ్, సహకారసంఘాల చైర్మన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇటీవల కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో రైతులు అధిక మొత్తంలో వరిపంటను సాగు చేశారన్నారు. సాగు విస్తీర్ణం పెరిగినందున దిగుబడి కూడా గణనీయంగా పెరిగే అవకాశ ముం దన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో11 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 4 కొనుగోలు కేంద్రాలు, బాచారం, గౌరెల్లి, బండరావిరాల, బాటసింగారం, ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం, దండుమైలారం, మంచాల మండలంలో మం చాల, నోముల, బోడకొండ, యాచారం మండలంలో యాచారం, చింతపట్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
గత సంవ త్సరం 7వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగుచేశారన్నారు. ఈ సంవత్సరం యాసంగిలో 22,942ఎకరాల్లో వరి సాగుచేశారన్నారు. గత సంవత్సరం 1.25లక్షల క్వింటాళ్లు ధాన్యం మాత్రమే కొనుగోలు చేశామని, ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినందున 4.50 లక్షల నుంచి 5 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకోసం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచినట్లు ఆయన వివరించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, రైతు పండించిన ప్రతి గింజను కూడా మద్దతుధరకే ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. అవసరమనుకుంటే రైతుల కల్లాల వద్దనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఎట్టి పరిస్థితిలో మధ్యదళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్కెటింగ్, సివిల్సప్లయ్ అధికారులు అవసరమైన బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, పుల్లారెడ్డి, సుదర్శన్రెడ్డి, వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ, డీసీఎంఎస్ అధికారి పాండురంగం, రైతు కోఆర్డినేటర్లు బలదేవ్రెడ్డి, జోగిరెడ్డితో పాటు వ్యవసాయశాఖల అధికారులు పాల్గొన్నారు.