మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు బంద్
నమస్తే తెలంగాణ నెట్వర్క్: పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి అదుపుతప్పి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్రను ఆనుకొని తెలంగాణ భూభాగంలో ఉన్న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి శివారులోని గోదావరి నది వంతెన మార్గం గుండా మహారాష్ట్ర నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీచేశారు. సోమవారం మండలస్థాయి అధికారులు మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో వాహనాల రాకపోకలను నిలిపివేసేందుకు బారికేడ్లను ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర నుంచి వాహనాలను అనుమతించవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్గంగ సరిహద్దు ప్రజలు సైతం మహారాష్ట్ర నుంచి వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. సోమవారం పెన్గంగ దాటి అంతర్గాం వైపు వస్తున్న మహారాష్ట్రలోని సగ్ద, సాంగ్వివాసులను టీఆర్ఎస్ నాయకులు బక్కి కపిల్యాదవ్, మేకల బక్కన్న యాదవ్ వెనక్కి పంపించారు. ఇక్కడి నుంచి మహారాష్ట్రకు బయలుదేరిన వారిని కూడా నిలిపివేశారు. పెన్గంగ ఒడ్డున ఉన్న గుబ్డీ, వడూర్, గొల్లగడ్, తాంసి(కె)వాసులు కూడా మహారాష్ట్రవాసులను కట్టడిచేస్తున్నారు.