Sidhu Moose Wala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ (Charan Kaur) ఇటీవలే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి 60 ఏళ్ల బాల్కౌర్ సింగ్ (Balkaur Singh) ఆదివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
అయితే, తాజాగా పంజాబ్ ప్రభుత్వం (Punjab government)పై సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బిడ్డ పుట్టినప్పటి నుంచీ పంజాబ్ ప్రభుత్వం తమను వేధిస్తోందన్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. ‘భగవంతుడి ఆశీస్సులతో మేము శుభదీప్ను (సిద్దూ మూసేవాలా) తిరిగి పొందాము. కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని వేధిస్తోంది. బాబుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని అడుగుతోంది. ఆ బిడ్డ చట్టబద్ధమనేనని నిరూపించుకోవాలని ఒత్తిడి తెస్తోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను ప్రశ్నించడానికి ఎక్కడికి రమ్మన్నా వస్తా. అన్ని చికిత్సలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. చట్టపరంగా అన్నివిధానాలను నేను అనుసరించాను. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పిస్తా’ అని ఆయన తెలిపారు.
కాగా, ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం కావడంతో.. అతడి మృతితో వారు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా చరణ్ కౌర్ గర్భం దాల్చింది. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే, మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్ విధానంలో బాబుకు జన్మనిచ్చినప్పటికీ బాల్కౌర్ సింగ్ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కనడంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఐవీఎఫ్ కోసం మహిళల వయసు 21 నుంచి 50 ఏళ్లు ఉండాలి. అదేవిధంగా పురుషుల వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, వీరి వయసు అంతకుమించి ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీరి నుంచి పలు పత్రాలను ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Gold mine collapse | కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకుపోయిన 13 మంది కార్మికులు