పువ్వాడ వసంతలక్ష్మి పోటీలో ఉండరు
నగరాభివృద్ధి బాధ్యత నాదే..
పనిచేసే వారికి పట్టం కట్టాలి
ఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): నగరంలో జరిగిన అభివృద్దిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలపించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. సోమవారం నగరంలోని తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు. పనిచేసే పార్టీకి మద్దతుగా నిలిస్తే ఖమ్మం నగరం మరింత సుందర నగరంగా మారుతుందన్నారు. నగరాభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజల ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధిని పరుగులు పెట్టించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రతిపక్ష పార్టీలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక, ఓర్వలేక పసలేని విమర్శలు చేస్తున్నాయన్నారు. ఆయా పార్టీలకు ప్రజలే బుద్ధిచెప్తారన్నారు. ఖమ్మంలో బీజేపీకి ఉనికే లేదని, చైతన్యవంతమైన ఖమ్మం ప్రజలు మతతత్వ పార్టీలను ఆదరించరని అన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడతారన్నారు. టీఆర్ఎస్, సీపీఐ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన వెంటనే టీఆర్ఎస్, సీపీఐ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు.
పువ్వాడ వసంతలక్ష్మి పోటీలో ఉండరు..
తన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి నగరపాలక సంస్థ మేయర్ పదవికి పోటీలో ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆమెకు పదవులపై ఏమాత్రం ఆసక్తి, ఆకాంక్ష లేదన్నారు. కార్పొరేటర్గా రంగంలో ఉంటారా..? అని అడిగిన ప్రశ్నకు ఏ పదవిలోనూ ఉండరని మంత్రి సమాధానమిచ్చారు. అనంతరం నగరాభివృద్ధిపై రూపొందించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మాజీ మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్-19 తొలి, రెండో వేవ్ల్లో డిఫరెన్స్ ఇదీ
IPL 2021: దూకుడుగా ఆడుతున్న బట్లర్