న్యూఢిల్లీ : వచ్చే నెల ఆరంభంలో జీ20 సదస్సు జరగనుండగా ప్రతిష్టాత్మక సదస్సుకు ముందు పలు ఢిల్లీ మెట్రో స్టేషన్ల (Delhi Metro) గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు దర్శనమిచ్చాయి. పంజాబి బాగ్, శివాజీ పార్క్, మదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహరాజా సురజ్మల్ స్టేడియం వంటి పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్తాన్ రిఫరెండం జిందాబాద్, ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ వంటి నినాదాలు రాశారు.
పలు మెట్రో స్టేషన్లలో నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) కార్యకర్తలు ఈ నినాదాలు రాశారని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు. నంగ్లోయ్లోని ప్రభుత్వ పాఠశాల గోడలపైనా ఇలాంటి రాతలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించి పలు ప్రదేశాల్లో తమ బృందాలను మోహరించింది.
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, రాతలను తొలగించామని డీసీపీ (మెట్రో) తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అనుమానితులను గుర్తించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. కాగా ఢిల్లీలో జీ20 సదస్సు జరిగే సెప్టెంబర్ 10న కెనడాలోని సర్రేలో ఖలిస్తాన్ రిఫరెండం నిర్వహిస్తామని ఎస్ఎఫ్జే చీఫ్ గుర్పత్వంత్ సింగ్ పన్ను చెబుతున్న వీడియోను ఆ సంస్ధ విడుదల చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Read More :