న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత, రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ సరఫరాలను పర్యవేక్షించాలని సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ను సర్వోన్నత న్యాయస్ధానం కోరింది. ఆక్సిజన్ అందక ప్రజలు మరణిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దేశంలో కరోనా వైరస్ సంక్షోభం, లాక్డౌన్ లను ప్రకటించేందుకు హైకోర్టుల అధికారంపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై ఎలాంటి ఉత్తర్వలు జారీ చేయని కోర్టు.. విపత్తు వేళ కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న అత్యవసర పరికరాల సరఫరా, ఆక్సిజన్ సరఫరాలపై బదులివ్వాలని కోరుతూ ఏప్రిల్ 27కు విచారణను వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యవహారంపై హైకోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు వారించడం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం హైకోర్టులు ముందుకు తెచ్చిన అంశాలపై నివేదించాలని కేంద్రాన్ని కోరినట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.