ముంబై : బీజేపీతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. తమ పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు దూరమని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని..ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పార్టీ కృషి చేస్తుందని అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన భవిష్యత్ మిత్రుడు వ్యాఖ్యల నేపధ్యంలో సంజయ్ రౌత్ వివరణ ఇచ్చారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రావ్సాహెబ్ దన్వేను ఉద్దేశించి ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఊహాగానాలకు తెరలేపాయి. శివసేన మళ్లీ కాషాయ పార్టీకి చేరువవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్తో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినం సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీని సరికొత్త శిఖరాలకు చేర్చిన మోదీకి దీటైన నాయకుడు ఎవరూ లేరని ఠాక్రే కొనియాడారు.