జైపూర్: రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. దీంతో అతనిని అందులో నుంచి వెలికితీయడానికి అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జాలోర్ జిల్లాలోని లచ్హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగారామ్ దేవాసీ తన వ్యవసాయ పొలంలో రెండు రోజుల క్రితం బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ నిన్న ఆడుకుంటూ బోరుబావి దగ్గరకు వెళ్లాడు. దానిపై కప్పి ఉంచిన వస్తువులను తీసివేసి.. అందులోకి తొంగి చూశాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయాడు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఇదంతా గమనించి.. చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఆ బావి 90 మీటర్ల లోతు ఉందని, బాలుడు మొత్తం కిందికి జారిపోయాడని సంచోర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఆచార్య చెప్పారు. అనిల్ దేవాసీని రక్షించే చర్యలు ప్రారంభించామని, అయితే నిపుణుల అందుబాటులో లేకపోవడం కొంత ఆలస్యం అయ్యిందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడని, బావిలోకి కెమెరాను పంపించి అతని కదలికలను గుర్తిస్తున్నామని చెప్పారు. పైపు ద్వారా ఆక్సిజన్ను అందిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అందులోకి పంపించామన్నారు. బోరు బావిని రెండు రోజుల క్రితమె తొవ్వారని, బాలుడు ప్రస్తుతం 90 మీటర్ల లోతులు ఉన్నాడని.. అతన్ని అందులోనుంచి క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి