Extreme Rain | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు (Extreme Rain) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (Red Alert )జారీ చేసింది.
‘పాపుమ్ పారే, పశ్చిమ కమెంగ్ జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో తూర్పు కమెంగ్, పక్కే-కేసాంగ్ జిల్లాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయి’ అని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా కురుంగ్ కుమే, లోయర్ సుబంసిరి, షి-యోమి, వెస్ట్ సియాంగ్, లోహిత్, చాంగ్లాంగ్, తిరప్, లాంగ్డింగ్ జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఇక మే 29, 30 తేదీల్లో పక్కే-కేసాంగ్, పాపమ్ పరే, సియాంగ్, లోహిత్, ఈస్ట్ కమెంగ్, వెస్ట్ కమెంగ్, కురుంగ్ కుమే, వెస్ట్ సియాంగ్, లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారత వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పెము ఖాండూ (Pema Khandu) హెచ్చరించారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ఎద్దడి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రదేశాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Also Read..
Kedarnath | కేదార్నాథ్ ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 18 రోజుల్లో 5 లక్షల మందికిపైగా దర్శనం..!
Delhi Metro | ఢిల్లీ మెట్రో రైలు రూఫ్పై మంటలు.. వైరలవుతున్న వీడియో
Papua New Guinea | 2 వేల మంది సజీవ సమాధి.. ద్వీప దేశానికి భారత్ ఆర్థిక సాయం