Papua New Guinea | నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్లోని కవోకలామ్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు (landslide) విరిగిపడిన ఘటనలో 2 వేల మంది సజీవ సమాధయ్యారు.
ఈ విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ (India) అండగా నిలిచింది. తక్షణ సాయం కింద 1 మిలియన్ డాలర్లు (USD 1 million) ప్రకటించింది (relief aid). ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విషాద ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ఉన్న పసిఫిక్ ద్వీప దేశానికి అన్ని రకాలుగా మద్దతు, సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు.
శుక్రవారం రాత్రి పపువా న్యూ గినియాలోని పర్వతప్రాంతాల్లో భారీ వర్షాలు కురియటంతో అక్కడి వందలాది గ్రామాలపైకి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వేలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ దుర్ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య 2 వేలకు పెరిగినట్లు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి (ఐరాస) తెలిపింది. ఆ దేశానికి చెందిన జాతీయ విపత్తు కేంద్రం ఐరాసకు లేఖ రాసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నది. అంతర్జాతీయ సాయం కావాలని ఆ దేశం ఐరాసను వేడుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం విమానం, ఇతర పరికరాలను సాయంగా పంపింది.
కాగా, గతంలోనూ పాపువా న్యూ గునియాకు భారత్ ఆర్థికంగా అండగా నిలిచిన విషయం తెలిసిందే. 2018లో సంభవించిన భూకంపం, 2019, 2023లో అగ్నిపర్వత విస్ఫోటనాలతో సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడిన కష్టాలు, వినాశన సమయాల్లో భారతదేశం పాపువా న్యూ గినియాకు అండగా నిలిచింది. ఈ మేరకు తన వంతు ఆర్థికంగా సాయం అందించింది.
Also Read..
Arvind Kejriwal | అది తీవ్రమైన సమస్య.. నెలలో 7 కేజీల బరువు తగ్గడంపై కేజ్రీవాల్
Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు