Arvind Kejriwal | తాను బరువు తగ్గడంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పంజాబ్లోని భటిండాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నేను చాలా బరువు తగ్గాను. ఓ వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా ఒక నెలలో 7 కిలోల బరువు తగ్గితే.. అది చాలా తీవ్రమైన సమస్య (Very Serious Problem). కాబట్టి వైద్యులు నాకు అనేక పరీక్షలు సూచించారు. ఇందుకోసం నా మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పెడిగించాలని సుప్రీంకోర్టును కోరాను. వారంలో నేను అన్ని వైద్య పరీక్షల్ని పూర్తి చేయాలి. ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉంటే వైద్య పరీక్షల్లో బయటపడుతుంది’ అని కేజ్రీవాల్ వివరించారు.
కాగా, లోక్సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్ స్కాం కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ (Extend Interim Bail) కేజ్రీవాల్ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కీటోన్ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం ధర్మాసనాన్ని తన పిటిషన్లో కోరారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. మార్చి 21న ఈడీ(ED) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.
Also Read..
Chiranjeevi | మరో అరుదైన గౌరవం.. చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు
Stone Quarry | భారీ వర్షాలతో కూలిన గ్రానైట్ క్వారీ.. పది మంది మృతి