Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని ఓ ‘చెడు శకునం’ (bad omen)గా అభివర్ణించారు. ఆయన అడుగుపెట్టడం వల్లే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో భారత్ జట్టు ఓడిపోయిందంటూ వ్యాఖ్యానించారు.
ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కళ్ల ముందే కప్పు చేజారడంతో భారత జట్టు సహా అభిమానులు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై కాంగ్రెస్ నేత రాహుల్ తాజాగా స్పందించారు. మంగళవారం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రపంచకప్ చేజారడానికి కారణం మోదీనే అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మన అబ్బాయిలు (టీమ్ఇండియా ఆటగాళ్లను ఉద్దేశిస్తూ) దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్నారు. కానీ చెడు శకునం ప్రవేశం వారిని ఓడిపోయేలా చేసింది’ అంటూ మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచింది. కీలకమైన సెమీస్లోనూ 2019 రన్నరప్ న్యూజిలాండ్ను 70 పరుగులతో చిత్తు చేయడంతో ఈసారి ట్రోఫీ మనదే అనుకున్నారంతా. అయితే.. దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరడంతో ట్రోఫీ దక్కేనా? అని మనసులో సందేహం. అనుకున్నట్టుగానే కంగారూల చేతిలో రోహిత్ సేన ఓటమిపాలైంది. అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) గోడలా నిలబడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇక ఈ మ్యాచ్కు ప్రధాన మంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
Also Read..
Akhilesh Yadav | అలాజరిగుంటే టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచేది : అఖిలేశ్ యాదవ్