Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)పై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో తమిళ, టాలీవుడ్ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలుస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్సూర్పై చెన్నై పోలీసులు (Chennai Police) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు (FIR Against Actor Mansoor).
చెన్నైలోని థౌజండ్ లైట్స్ (Thousand lights) ప్రాంతంలోగల మహిళా పోలీస్ స్టేషన్ (Women Police Station)లో నటుడు మన్సూర్పై లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ముందుగా అతడికి నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు.
ఇంతకీ ఏం జరిగింది అంటే ?..
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్లో త్రిషను కనీసం నాకు చూపించలేదు. అంటూ మన్సూర్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడుతున్నారు.
త్రిష ఫైర్..
మరోవైపు ఈ ఘటనపై త్రిష కూడా ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోంది. అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని. నా మిగిలిన కెరీర్ లో అలాగే నా సినిమాలో అతడు లేకుండా చూసుకుంటాను. మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది. అంటూ త్రిష ట్విట్టర్లో రాసుకొచ్చింది.
క్షమాపణలు చెప్పేదే లేదు..
మన్సూర్.. మంగళవారం చెన్నైలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘నాపై తాత్కాలిక నిషేధం విధించి నడిగర్ సంఘం పెద్ద మిస్టేక్ చేసింది. నా నుంచి వివరణ కోరి ఉంటే బాగుండేది. నోటీసు కూడా ఇవ్వకుండా నాపై నిషేధం ఎలా విధిస్తుంది..? నేను ఏ తప్పూ మాట్లాడలేదు. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేదే లేదు. ఈ విషయంలో నేను క్షమాపణలు చెప్పేదీ లేదు. నడిగర్ సంఘానికే నేను నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నా. నాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలి’ అని వార్నింగ్ ఇచ్చారు.
‘నేనేమీ తప్పుగా మాట్లాడలేదే. రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడాను. సినిమాలో హత్య చేస్తే అది నిజంగానే చేసినట్టేనా..? సినిమాల్లో మర్డర్ సీన్ అంటే నిజంగా మర్డర్ చేస్తారా? మీడియా వాళ్లు నా వ్యాఖ్యల్ని వక్రీకరించి రాశారు. వాళ్లు నాకు వ్యతిరేకంగా నచ్చినట్టు రాసుకోవచ్చు. నా ఫోటోలు కూడా మంచివి వాడలేదు. అంతకంటే మంచి ఫోటోలు మీకు దొరకలేదా..? (ప్రెస్ మీట్లో మీడియావాళ్లని ప్రశ్నించాడు). ఈ విషయంలో నేను క్షమాపణలు చెప్పను. ప్రజలకు నేనేంటో తెలుసు. నాకు తమిళ ప్రజల మద్దతు ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు ఈ కాంట్రవర్సీలో తమిళ, టాలీవుడ్ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, గాయని చిన్మయి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, హీరో నితిన్ సహా పలువురు స్టార్స్ త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం (Nadigar Sangam) సైతం ఆయనపై చర్యలు చేపట్టింది. ఆయనపై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. అయితే, మన్సూర్ మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెబుతుండటం గమనార్హం.
Also Read..
Heavy Rains | కేరళ, తమిళనాడుకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Akhilesh Yadav | అలాజరిగుంటే టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచేది : అఖిలేశ్ యాదవ్