రాయ్పూర్ : ఎన్నికల ప్రచారం సందర్భంగా నేతలు ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ప్రవాహంలా ప్రసంగాలను హోరెత్తిస్తుంటారు. అయితే కొన్నిసార్లు నోరు జారే ఉదంతాలు ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రాలను అందిస్తుంటాయి. చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాగే దొరికిపోవడంతో బీజేపీ నేతలు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
కబీర్ధాంలో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్ (Rahul Gandhi) మాట్లాడుతూ బీజేపే సంపన్నుల సేవలో తరిస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూపును ప్రస్తావించిన కాంగ్రెస్ నేత కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. ఈ క్రమంలో నోరు జారిన రాహుల్ చత్తీస్ఘఢ్లో పాలక కాంగ్రెస్ సీఎం అదానీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించి ఇరుకునపడ్డారు. అదానీ సేవలో కాషాయ పాలకులు నిత్యం తరిస్తున్నారని, ఇక్కడున్న సీఎం కూడా అదానీ కోసం పనిచేస్తున్నారని, అయితే తాము మాత్రం రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో అదే వేదికపై ఉన్న చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ రాహుల్ వ్యాఖ్యలతో కంగుతిన్నారు. చత్తీస్ఘఢ్ సీఎం అదానీ గ్రూప్ కోసం పనిచేస్తారని రాహుల్ గాంధీ అంగీకరించారని బీజేపీ ట్రోల్ చేసింది. చివరికి వాస్తవం బయటకు వచ్చిందని, అదానీ గ్రూప్ను కాంగ్రెస్ పెంచిపోషిస్తోందని రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు.
Read More :
November Bank holidays | నవంబర్లో బ్యాంకులు పని చేసేది సగం రోజులే.. ఇవీ డిటైల్స్..!