పట్నా : బిహార్ ప్రభుత్వం కుల గణన (Caste Census) వివరాలు విడుదల చేసిన క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వారి జనాభా ఆధారంగా హక్కులను అందచేయాలని రాహుల్ పేర్కొన్నారు. బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గుణన దేశంలో కుల గణాంకాలు తెలియాల్సిన ప్రాధాన్యతను తెలియచెప్పిందని వ్యాఖ్యానించారు. బిహార్లో కుల గణన ఆధారంగా రాష్ట్రంలో ఓబీసీ, ఈబీసీ జనాభా 63 శాతం కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా 84 శాతంగా వెల్లడైంది.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే మొత్తం 90 మందిలో కేవలం ముగ్గురే ఓబీసీలు..వీరు దేశ బడ్జెట్లో కేవలం 5 శాతాన్నే నిర్వహిస్తున్నారు..అందుకే దేశంలో కుల గణాంకాలు తెలుసుకోవాలని రాహుల్ ట్వీట్ చేశారు. జనాభా ఎక్కువగా ఉన్న ప్రజలకే..అధిక హక్కులు ఇచ్చేలా మనం ప్రతిన బూనాలని ఆయన రాసుకొచ్చారు. ఇక అంతకుముందు కుల గణన చేపట్టేందుకు అహోరాత్రులు శ్రమించిన బృందాన్ని బిహార్ సీఎం నితీష్ కుమార్ అభినందించారు.
ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా బిహార్లో చేపట్టిన కులగణన వివరాలను ప్రచురించామని, ఈ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది మొత్తానికి అభినందనలని బిహార్ సీఎం ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో కులగణన చేపట్టాలని బిహార్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ప్రతిపాదనకు గత ఏడాది జూన్ 6న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముంద్ర వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన సొంత వనరులతోనే ఈ కార్యక్రమం చేపట్టిందని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు.
Read More :