Rahul Gandhi | ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులపాటు యూరప్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి రాహుల్ యూరప్ పర్యటనకు (Europe Tour) బయలుదేరి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ పర్యటనలో భాగంగా రాహుల్ యూరోపియన్ యూనియన్ (EU) లాయర్లు, విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 7న బ్రస్సెల్స్, హేగ్లో ఈయూ (European Union) న్యాయవాదుల బృందంతో భేటీ అవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన పారిస్లోని ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 9న పారిస్లో జరిగే లేబర్ యూనియన్ ఆఫ్ ఫ్రాన్స్ సమావేశంలో కూడా రాహుల్ పాల్గొననున్నారు. ఆ తర్వాత నార్వేను సందర్శిస్తారు. సెప్టెంబర్ 10న ఓస్లోలో జరిగే డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 11వ తేదీన తన పర్యటనను ముగించుకొని రాహుల్ స్వదేశానికి తిరిగి వస్తారని వారు వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు స్వయంగా హాజరుకాబోతున్నారు.
Also Read..